పత్రిక ప్రకటన
తేదీ : 22–12–2022
రాష్ట్రపతి రానున్న నేపథ్యంలో అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేయాలి,
ఈనెల 26న శీతాకాల విడిదికి హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,
హకీంపేట ఎయిర్పోర్టును పరిశీలించిన కలెక్టర్, పోలీస్ ఉన్నతాధికారులు,
జిల్లా స్థాయి అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండేలా చర్యలు,
అధికారులతో సమావేశం నిర్వహించిన మేడ్చల్ – మల్కాజిగి రిజిల్లా కలెక్టర్ హరీశ్ ,
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం ఈనెల 26న హైదరాబాద్ రానున్న నేపథ్యంలో మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా పరిధిలోని హకీంపేట ఎయిర్ పోర్టును గురువారం జిల్లా కలెక్టర్ హరీశ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, ఎయిర్ పోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి నరేంద్ర వర్మ, వింగ్ కమాండర్ చౌదరి, ఆధ్వర్యంలో ఎయిర్పోర్టును పరిశీలించారు. రాష్ట్రపతి ఈనెల 26న సాయంత్రం 4.15 గంటలకు రానున్న నేపథ్యంలో ఎయిర్పోర్టులో చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్తలు, తదితర అంశాలపై చర్చించారు. అనంతరం జిల్లా కలెక్టర్ హరీశ్ ఆధ్వర్యంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, హకీంపేట ఎయిర్పోర్టు చీఫ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి నరేంద్ర వర్మ, వింగ్ కమాండర్ చౌదరితో ఎయిర్ పోర్టు ఆవరణలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీశ్ మాట్లాడుతూ శీతాకాల విడిదికి హైదరాబాద్కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 26న సాయంత్రం 4.15 గంటలకు ప్రత్యేక విమానంలో హకీంపేట ఎయిర్పోర్టుకు చేరుకొని అధికారుల గౌరవ వందనం స్వీకరిస్తారని తెలిపారు. హకీంపేట ఎయిర్పోర్టుకు రాగానే రాష్ట్రపతిని కలిసేందుకు ప్రభుత్వం అనుమతించిన వారినే కలిసి స్వాగతం పలికేలా ప్రొటోకాల్ ప్రకారం వారిని పంపించాలని ఈ విషయంలో పోలీసు అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రపతి మొట్టమొదటిసారిగా శీతాకాల విడిదికి హైదరాబాద్కు వచ్చి తిరిగి వెళ్ళే వరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ విషయంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హరీశ్ సూచించారు. రాష్ట్రపతి హకీంపేట ఎయిర్ పోర్టుకు రానున్న నేపథ్యంలో కీసర ఆర్డీవో రవి నోడల్ ఆఫీసర్గా నియమించామని ఆయన ఆధ్వర్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యటన జరిగేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టులో జిల్లా అటవీ శాఖ అధికారి జానకీరామ్ ఆధ్వర్యంలో మంచి మొక్కలు, ప్లాంటేషన్ చేయడంతో పాటు రాష్ట్రపతి వెళ్ళే సమయంలో రోడ్లకు ఇరువైపులా అందమైన మొక్కలను ఉంచాలని ఈ విషయంలో అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే ఎయిర్పోర్టుతో పాటు ఆయా ప్రాంతాల్లో అవసరమైన చోట మొబైల్ వాష్రూమ్లను ఏర్పాటు చేయాలని తూంకుంట మున్సిపల్ కమిషనర్ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. హకీంపేట ఎయిర్పోర్టుకు రాష్ట్రపతి చేరుకోగానే సంబంధిత సెక్యూరిటీ పరమైన ఏర్పాట్లను పేట్బషీర్బాగ్ ఏసీపీ రామలింగరాజు పర్యవేక్షించాల్సి ఉంటుందని ఈ విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ హరీశ్ తెలిపారు. అలాగే జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో పాటు అవసరమైన మందులు, మెడికల్ కిట్స్ అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాస్కు తెలిపారు. రాష్ట్రపతి హకీంపేట ఎయిర్ పోర్టు నుంచి బొల్లారం వెళ్ళే రహదారిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గుంతలను పూడ్చివేయడం, కొత్తగా రోడ్డు వేయడం చేయాలని ప్రయాణం ఇబ్బందులు లేకుండా జరిగేలా చర్యలు చేపట్టాలని రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్ మూర్తి కు కలెక్టర్ హరీశ్ సూచించారు. హకీంపేట ఎయిర్పోర్టుకు రాష్ట్రపతి వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్ళేంత వరకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అందు కోసం ముందస్తుగా అవసరమైన సిబ్బందితో పాటు జనరేటర్ను కూడా అందుబాటులో ఉంచుకోవాలని ట్రాన్స్కో ఎస్ఈకి సూచించారు. రాష్ట్రపతి హకీంపేట ఎయిర్పోర్టు నుంచి రోడ్డు మార్గాన రాష్ట్రపతి బయలుదేరి వెళ్ళే సమయంలో అవసరమైన బందోబస్తు కల్పించడంతో పాటు ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించరాదని పోలీసు అధికారులకు వివరించారు. అలాగే ఎయిర్ పోర్టులో అగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచాలని ఫైర్ ఆఫీసర్ ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. దీంతో పాటు ఎయిర్పోర్టుతో పాటు రాష్ట్రపతి వెళ్ళే మార్గంలో అవసరమైన శానిటేషన్ను సంబంధిత మున్సిపల్ కమిషనర్లు చూసుకోవాలని ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో, జీఏడీ అధికారులు, డీసీపీ బాలానగర్, సందీప్, పేట్బషీర్బాగ్ ఏసీపీ రామలింగరాజు, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్రావు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాస్, జిల్లా అటవీ శాఖ అధికారి జానకీరామ్, నోడల్ ఆఫీసర్ రవి, కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, అగ్నిమాపక శాఖ, ట్రాన్స్కో అధికారులు తదితరులు పాల్గొన్నారు.