రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఖమ్మం నగరం 44వ డివిజన్ భక్త రామదాస్ కళాక్షేత్రంలో కంటి వెలుగు శిబిరాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణే ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అని, కంటి చూపు ఉంటేనే మన జీవితం ముందుకెళ్తుందని, అంధత్వంలేని తెలంగాణ కోసం కంటి వెలుగు .కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని అన్నారు. కేంద్రాల్లో కంటి వెలుగు స్క్రీనింగ్ పరీక్షల నిర్వహణ అద్భుతంగా కొనసాగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో దేశంలో ఎక్కుడా లేని విధంగా అభివృద్ధి- సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. కంటి చూపు బాగుంటేనే మనం ఏ పని అయిన చేసుకోగలుగుతామని, గ్రామీణ ప్రాంతాల్లో కంటి పరీక్షలు చేసుకోవాలంటే పట్టణాలకు వెళ్ళాలని, అవగాహన లోపం వల్ల ఎక్కువ మంది దృష్టి లోపానికి గురవుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లో ఏ ఒక్క వ్యక్తి కంటి సమస్యతో బాధ పడకూడదని కంటి వెలుగు పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారన్నారు.. కంటి వెలుగు ఒక మంచి ప్రజా ప్రయోజిత కార్యక్రమమని ప్రజలు మరింతగా సద్వినియోగించుకోవాలని మంత్రి కోరారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్లు మరియు ఏ ఇతర పథకాలు చేపట్టినా వంద శాతం అమలు చేసింది ఒక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని మంత్రి అన్నారు. ప్రజా ప్రతినిధులు కంటి వెలుగు కార్యక్రమంపై ప్రజలకి అవగాహన కల్పించి అధికారులని సమన్వయం చేసుకుంటూ విజయవంతం చేయాలని కోరారు.
||కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మేయర్ పునుకొల్లు నీరజ, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ శ్వేత, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్ పాలేపు విజయ, డిప్యూటీ వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాంబాబు, వైద్యులు, సిబ్బంది ఉన్నారు.