బ్యాంకులు రైతాంగానికి పంట రుణాలను లక్ష్యానికి అనుగుణంగా మంజూరు చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సెప్టెంబర్, 2021 మాసాంతానికి అంతమయ్యే బ్యాంకర్ల కమిటీ సమావేశం సోమవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సందర్బంగా బ్యాంకర్లను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని రైతులకు పంట రుణాలు సకాలంలో అందించాలని, ఈ ఆర్థిక సంవత్సరంలో 198.86 కోట్లు లక్ష్యం కాగా 101.61 కోట్ల రుణాలను మాత్రమే సెప్టెంబర్ మాసాంతానికి అందించడం జరిగిందని తెలిపారు. వ్యవసాయ రుణాలు, వ్యవసాయ సంబంధ రుణాలు, పరిశ్రమలు, విద్య, గృహనిర్మాణం, ఉపాధి, బ్యాంకు లింకేజి వంటి రుణాలు ఆయా బ్యాంకులు ఎక్కువ మొత్తంలో సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో మంజూరు చేయాలనీ అన్నారు. పరిశ్రమల స్థాపనపై నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించి, అవసరమైన శిక్షణలు ఇప్పించి రుణాలు అందించాలని అన్నారు. మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజి రుణాల పరిమితిని పెంచాలని బ్యాంకర్లకు సూచించారు. పెండింగ్ లో ఉన్న రుణాలను వసూలు చేయడానికి ఐకేపీ, బ్యాంకర్లు కృషి చేయాలనీ అన్నారు. ఇప్పటివరకు బ్యాంకు లింకేజి కింద 198.89 కోట్లు రుణాలు అందించాల్సి ఉండగా 109.94 కోట్లు మాత్రమే మంజూరు చేయడం జరిగిందని, వచ్చే మాసాంతానికి లక్ష్యాలను సాధించాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, బ్యాంకు లింకేజి 12 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా, ప్రస్తుతం 7 కోట్ల రూపాయలు మాత్రమే రుణాలు చెల్లించవలసి ఉందని అన్నారు. బ్యాంకు లింకేజి రుణపరిమితిని పెంచాలని అన్నారు. ఆదిలాబాద్ పట్టణ బ్యాంకు లింకేజి 98.16 శాతం సాధించి దేశం లోని 5 వ స్థానంలో నిలిచామని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్ మాట్లాడుతూ, మహిళా మహోత్సవ్ కార్యక్రమాలను అన్ని బ్యాంకుల్లో నిర్వహించి మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేయాలనీ కోరారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి బ్యాంకర్లు సహకరించాలని కోరారు. అంతకు ముందు లీడ్ బ్యాంకు మేనేజర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, వివిధ బ్యాంకులు అందిస్తున్న రుణాలపై వివరించారు. బ్యాంకర్లకు సంక్షేమ శాఖల అధికారులు సంయుక్తంగా వివిధ పథకాల క్రింద నిరుద్యోగులకు మంజూరు అయిన యూనిట్ లను వెంటనే స్థాపించాలని కోరారు. పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ పద్మభూషణ్ రాజు మాట్లాడుతూ, స్థానిక డిమాండ్ లను దృష్టిలో ఉంచుకొని పరిశ్రమలను నెలకొల్పేందుకు యువత ముందుకు రావాలని, బ్యాంకర్లు ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్ ఈడి శంకర్ మాట్లాడుతూ, ఎస్సీ లబ్ది దారులకు పెండింగ్ లో ఉన్న యూనిట్ లను గ్రౌండింగ్ చేయాలనీ అన్నారు. పాడి రైతులకు బ్యాంకు రుణాలకు సహకరించడం, మేత సరఫరా, భీమా సౌకర్యం కల్పించడం జరుగుతుందని, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి రంగారావు తెలిపారు. అనంతరం 2022-23 పొటెన్షియల్ లింకుడ్ క్రెడిట్ ప్లాన్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో RBI AGM తేజ్ దీప్ బెహరా, జిల్లా వ్యవసాయ అధికారి ఆశకుమారి, డీపీఎం శోభా, వివిధ బ్యాంకుల మేనేజర్లు, తదితరులు పాల్గొన్నారు.