లుంపి స్కిన్ వ్యాధి నియంత్రణ టీకాలు వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో పశు సంవర్థక శాఖతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని పశువులకు టీకాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో 3 లుంపి స్కిన్ వ్యాధి పాజిటివ్ కేసులు వచ్చినట్లు, వాటికి చికిత్స అందించినట్లు, మరణాలు సంభవించలేదని ఆయన తెలిపారు. జిల్లాలో 90 వేల ఆవులు (వైట్ ఆనిమల్స్) ఉండగా, 81 వేలకు (92 శాతం), 2,32,000 గేదెలు (బ్లాక్ ఆనిమల్స్) ఉండగా 25322 లకు (10శాతం) వ్యాక్సినేషన్ పూర్తయినట్లు తెలిపారు. మిగులు వైట్ ఆనిమల్స్ వ్యాక్సినేషన్ వెంటనే పూర్తి చేసి, ఆ తర్వాత బ్లాక్ ఆనిమల్స్ వ్యాక్సినేషన్ పూర్తికి చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పశు వైద్యుల క్షేత్ర అభిప్రాయాన్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పశువుల రవాణా ఆంక్షలు తొలగినందున దళితబంధు డెయిరీ యూనిట్ల సేకరణ చేపట్టాలన్నారు. సేకరణకు 5 నుండి 6 టీములు ఏర్పాటుచేయాలన్నారు. వచ్చే నెల 15 నాటికి యూనిట్ల సేకరణ పూర్తి చేయాలన్నారు. దూర ప్రాంతాల నుండి తెచ్చిన పశువులను పశు వైద్యాధికారులు రెగ్యులర్ గా పర్యవేక్షణ చేయాలన్నారు. యూనిట్లను పొందిన గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. పశువుల సంరక్షణపై అవగాహన లేని లబ్దిదారులకు మేత, పాలు పితకడం, సంరక్షణ పై అవగాహన కల్పించాలన్నారు. దళితబంధు పథక పైలట్ ప్రాజెక్టుగా ఉన్న చింతకాని మండలానికి ఎక్కువ మంది పశు వైద్యులను ఉపనియామకం పై నియమించాలన్నారు. సేకరణ, సేకరణ తదుపరి సంరక్షణలో వారు పాలుపంచుకోవాలన్నారు. మిగులు గొర్రెల యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు. గొర్రెల యూనిట్లకు షెడ్లు ఖచ్చితంగా ఉండేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా ఎన్ని గొర్రెలు సేకరించింది, ఎన్ని పిల్లలు పుట్టింది, రవాణా, తెచ్చిన తర్వాత ఎన్ని చనిపోయింది అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కూసుమంచి కి చెందిన రైతు మామిడి వెంకటేశ్వర్లు రూ. 30 వేలు విలువ చేసే 3 కిలోల మేథాలిన్ బ్లూ (క్యాటిల్ లైఫ్ సేవ్ డ్రగ్) కలెక్టర్ కు అందించగా, కలెక్టర్ రైతును అభినందించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, పశు సంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు డా. వేణు మనోహర్, సహాయ సంచాలకులు డా. భాను, డా. అరుణ, డా. రమణి, పశు వైద్యులు డా. రాజు, డా. హరీష్ తదితరులు పాల్గొన్నారు.