పత్రికా ప్రకటన
సంగారెడ్డి, జూలై 30:–
వంద శాతం హరిత లక్ష్యాన్ని సాధించాలి….అదనపు కలెక్టర్ రాజర్షి షా
పురపాలిక లలో వంద శాతం హరిత లక్ష్యాన్ని ఆగస్ట్ 15 లోగా పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా మున్సిపల్ కమిషనర్లకు ఆదేశించారు.
శుక్రవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో మునిసిపల్ కమీషనర్లు, ఇంజినీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు హరిత హారం ఇంఛార్జి లతో రాజర్షి షా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పురపాలిక లలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు హరితహారం 64 శాతం మాత్రమే పూర్తయిందని పేర్కొన్నారు. ఆగస్ట్ 15 లోగా వంద శాతం లక్ష్యాన్ని పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
అన్ని మున్సిపాలిటీలలో బృహత్ పట్టణ ప్రకృతి వనం ఒకటి ఏర్పాటు చేయాలన్నారు. ఇప్పటికే స్థలాలు గుర్తించినందున, ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం వేగవంతంగా పూర్తిచేయాలని తెలిపారు.
మునిసిపాలిటీ ప్రతి వార్డు లో పట్టణ ప్రకృతి వనం త్వరితగతిన ఏర్పాటు చేయాలని సూచించారు.
ప్రభుత్వం నుండి ప్రతి నెల విడుదల అవుతున్న పట్టణ ప్రగతి నిధులు పూర్తిగా ఖర్చు చేయడం లేదని, ఆయా పనులకు కేటాయించిన నిధులు వినియోగించాలని ఆదేశించారు. మునిసిపాలిటీ నిధులలో 10 శాతం గ్రీన్ బడ్జెట్కు వినియోగించాలన్నారు.
2014 సంవత్సరం తరువాత ఏర్పాటైన లే అవుట్ ల ఆడిట్, ఎల్.ఆర్.యస్. దరఖాస్తుల ను క్లస్టర్ వారీగా వేరుచేసి ఇన్స్పెక్షన్ కోసం సిద్ధం చేయాలన్నారు. వైకుంటథామం , డంప్ యార్డ్ ల నిర్మాణం , వాటి వినియోగం పై మునిసిపాలిటీ వారీగా సమీక్ష చేసి దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీల కమిషనర్లు, ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.