పత్రికా ప్రకటన. తేది:10.12.2021, వనపర్తి.
కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకొని డిసెంబర్ 31వ. తేదిలోపు 100 శాతం వ్యాక్సినేషన్ జిల్లాగా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సంబంధిత అధికారులకు, ఆదేశించారు.
శుక్రవారం జిల్లా రాజస్వ మండల అధికారి కార్యాలయ సమావేశ మందిరంలో వ్యాక్సినేషన్ పై ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ఆయా వార్డులలో అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తిచేయాలని, మున్సిపల్ సిబ్బందికి, వైద్య అధికారులకు, అంగన్వాడి, ఆశా వర్కర్లు, కౌన్సిలర్లు సమన్వయంతో రోజువారి ప్రణాళికలు తయారుచేసి, దాని ప్రకారం వ్యాక్సినేషన్ చేయాలని ఆమె సూచించారు.
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని దుకాణ దారుల వ్యాక్సినేషన్ కొరకు రెండు “మొబైల్ వాక్సినేషన్ టీమ్” వాహనాలను ఏర్పాటు చేసి, ప్రత్యేక అధికారుల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించి మొదటి, రెండవ వాక్సినేషన్ డోసు లు తీసుకునేలా చర్యలు చేపట్టాలని ఆమె మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. రెండవ డోసు కు అర్హులుగా వున్న వారి జాబితాను తయారు చేసి ఇవ్వటం జరిగిందని, దాని ప్రకారం షాపులు వారీగా, అదేవిధంగా ఇంటింటికీ వెళ్ళి వ్యాక్సినేషన్ చేయాలని ఆమె వివరించారు.
వనపర్తి మున్సిపాలిటీలో 10 వ. తేది రెండవ డోసు తీసుకొనుటకు 1 వేయి 7 వందల మంది అర్హులుగా వున్నట్లు ఆమె తెలిపారు. 6 వ. వార్డులో 436 మంది, 3 వ. వార్డులో 166 మంది, 2 వ. వార్డులో 181 మంది, వ్యాక్సిన్ తీసుకొనుటకు అర్హులుగా వున్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు.
వనపర్తి జిల్లాలో 24 మంది రేషన్ డీలర్లు ఉన్నారని, రేషన్ డీలర్లకు భాగస్వామ్యం చేసుకోని వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని, బస్ స్టేషన్లలో ఒక వ్యాక్సినేషన్ సెంటర్ ని ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారికి ఆమె ఆదేశించారు.
ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు నాయక్, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ శ్రీనివాసులు, డి డబ్ల్యూ ఓ పుష్పలత, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, ఎమ్మార్వో రాజేందర్ గౌడ్, ప్రోగ్రామ్ అధికారి, డి ఐ ఓ రాంచందర్ రావ్, పీపీ యూనిట్ డాక్టర్లు, సూపర్వైజర్లు, ఎ.ఎన్.ఎం.లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.