శుక్రవారం నాడు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వయోవృద్ధుల సంక్షేమ కమిటీ సమావేశం నిర్వహించబడింది.
సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి మూడు నెలలకు ఒకసారి వయో వృద్ధుల సంక్షేమ కమిటీ సమావేశం ద్వారా వారి సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలు సమీక్షించడం, వారి నుండి వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. వృద్ధులు దైవంతో సమానమని, వారిని ఆ వయసులో జాగ్రత్తగా కాపాడుకోవడం కుటుంబ సభ్యుల బాధ్యత అని, వారి హక్కులకు భంగం కలిగించినా, వారి సంరక్షణ పట్ల అశ్రద్ధ కనబరిచినా చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. కమిటీలో ఉన్న అన్ని శాఖలు వారి సమస్యల కోసం సమన్వయంతో పనిచేయాలని, వారి ఆస్తులు, కోర్టు కేసుల ఉత్తర్వుల అమలుకు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు వయోవృద్ధుల వివరాలను పరిశీలించాలని, వారిలో నిస్సహాయంగా, దీనస్థితిలో ఉన్న వాళ్లను ప్రత్యేకంగా పరిగణించి రక్షణ చర్యలు చేపట్టాలని, చట్ట ప్రకారం వారికున్న హక్కులు వారి కుటుంబ సభ్యులకు తెలిసేలా అవగాహన కల్పించాలని, ఇందుకు గాను తాసిల్దార్ స్థాయి నుండి పోలీసు, పంచాయతీ సెక్రెటరీ వరకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని తెలిపారు. వయో వృద్ధులకు సంబంధించి వ్రృద్దుల సహాయ నెంబర్ 14567 ఫిర్యాదు చేయాలని తెలిపారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఫిర్యాదుల పరిష్కార కొరకు తీసుకుంటున్న చర్యలను, ప్రగతిని సమీక్షించడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటివరకు భువనగిరి డివిజన్ కు సంబంధించి 71 ఫిర్యాదులకు 59, చౌటుప్పల్ డివిజన్ సంబంధించి 110 ఫిర్యాదులకు 91 పరిష్కరించడం జరిగిందని తెలిపారు. వారిని అన్ని రకాలుగా ఆదుకోవడం జరుగుతుందని, అవసరమైతే సంరక్షణ కేంద్రంలో చేర్చుకోవడం జరుగుతుందని తెలిపారు.
సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా రెవెన్యూ అధికారి కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, ఏసిపి వెంకట్ రెడ్డి, రెడ్డి, భువనగిరి ఆర్డీవో భూపాల్ రెడ్డి, చౌటుప్పల్ ఆర్డిఓ సూరజ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సాంబశివరావు, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధికారి కృష్ణవేణి, సఖి లీగల్ కౌన్సిలర్ చంద్రశేఖర్, ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.

