కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రులు ఎర్రబెల్లి,సత్యవతి సమీక్ష.
వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్ జిల్లాలను హనుమకొండ, వరంగల్ జిల్లాలుగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది.ఇందులో 2027.89 చ.కిమీ వైశాల్యంతో, 9,63,975 మంది జనాభాతో వరంగల్ జిల్లాగా,1466.23 చ.కిమీ వైశాల్యంతో 8,35,420 మంది జనాభాతో హనుమకొండ జిల్లాగా నిర్ణయించడం జరిగింది.
జిల్లాల పేర్లు మార్చుతూ, మండలాల మార్పు, చేర్పులపై ప్రభుత్వం విడుదల చేసిన ప్రతిపాధనలపై ఇరు జిల్లాల ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు కోరుతూ 30 రోజులపాటు సమాయాన్ని ఇస్తూ గత నెల 12న ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.దీంతో ఆయా జిల్లాల్లోని ప్రజల నుండి సూచనలు, అభ్యంతరాలను స్వీకరించారు. వరంగల్ రూరల్ జిల్లా నుంచి 41, వరంగల్ అర్భన్ జిల్లా నుంచి 92 అంభ్యతరాలు సూచనలు వచ్చాయి.
బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది,గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖామంత్రి సత్యవతి రాథోడ్లు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ ధాస్యం వినయ్ భాస్కర్,స్టే.ఘన్ పూర్ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి డా.టి.రాజయ్య,పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వరంగల్ అర్భన్ జిల్లా పరిషత్ చైర్మన్ డా.సుధీర్కుమార్, వరంగల్ అర్భన్,రూరల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధి హనుమంతు, హరితలతో సమావేశమై ప్రజల నుంచి వచ్చిన సూచనలు, అభ్యంతరాలపై సుధీర్ఘంగా చర్చించారు.ప్రజల నుంచి సూచనలు,అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ప్రజాభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకునేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు.
పరిపాలనా సౌలభ్యంతో పాటు, కాకతీయుల పాలనతో వరంగల్కు,హనుమకొండకు ఉన్న ప్రాశస్థ్యాన్ని భవిష్యత్ తరాలకు అందించేందుకు చిరకాలం నిలిచిపోయే విధంగా ఉండేందుకు ప్రభుత్వం వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్ జిల్లాల పేర్లను మార్చి వరంగల్, హనుమకొండ జిల్లాలుగా నామకరణం చేస్తూ నిర్ణయం తీసుకుందని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్ లు అన్నారు.