శనివారంనాడు ఆయన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణ, రాష్ట్ర వ్యవసాయశాఖ స్పెషల్ సెక్రెటరీ రఘునందన్ రావు, రాష్ట్ర సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్, రాష్ట్ర ట్రాన్స్ పోర్ట్ విభాగం కమీషనర్ శ్రీనివాసరాజు, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్లతో వానాకాలం వరి ధాన్యం కొనుగోళ్ళు, వచ్చే యాసంగిలో క్రాప్ బుకింగ్ పై జిల్లాల వారీగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని, రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని తెలిపారు. కొనుగోలు, రవాణా ప్రక్రియలో పోలీసు, రెవెన్యూ,రవాణా శాఖల అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల నుండి ధాన్యం రాకుండా, దళారీల వ్యవస్థ లేకుండా పఠిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా యాసంగి వరి పంట బాయిల్డ్ రైస్ మాత్రమే తయారవుతుందని, కేంద్ర ప్రభుత్వం మరియు ఎఫ్.సి.ఐ బాయిల్డ్ రైస్ కోనుగోలు నిరాకరిస్తున్న నేపథ్యంలో వరి పంట సాగు శ్రేయస్కరం కాదని పేర్కొన్నారు. వచ్చే యాసంగిలో వరి పంటకు బదులుగా ఇతర ప్రత్యామ్నాయ పంటలు వేసేలా గ్రామాలలోని రైతు వేదిక భవనాలలో ప్రతి రోజూ రైతులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, పంటల సాగు పధ్ధతులు, ఎరువులు తదితరుల విషయాలపై సలహాలు, సూచనలతో కార్యక్రమాలు రూపొందించాలని తెలిపారు. పెండింగ్ మిల్లింగ్ లక్ష్యాలను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.
రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాలలో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి మన రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించే మధ్య దళారీలపై పూర్తి నిఘా పెట్టాలని, అక్రమ రవాణా అరికట్టాలని, సరిహద్దు ఉమ్మడి జిల్లాల పోలీసు, రెవెన్యూ అధికారులు ఒక టీమ్ లాగా అప్రమత్తంగా పనిచేయాలని తెలిపారు.
వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, జిల్లా సహకార అధికారి ప్రమీల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనూరాధ, ఎ.ఎస్.ఓ. బ్రహ్మరావు పాల్గొన్నారు.


