విద్యా సంస్థల పునఃప్రారంభానికి ఆగస్టు 30 లోగా సన్నద్ధం చేయాలి:: రాష్ట్ర విద్యా శాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి
జనగామ, ఆగస్టు 24: విద్యా సంస్థల పునఃప్రారంభానికి ఆగస్టు 30 లోగా అన్ని చర్యలు పూర్తి చేసి సన్నద్ధం చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. విద్యాసంస్థల ప్రారంభం నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల పై రాష్ట్ర పంచాయతిరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మంగళవారం వీడియో కాన్పరెన్సు నిర్వహించారు. కరోనా నుంచి కోలుకుంటున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఆయా ప్రభుత్వాలు విద్యాసంస్థల పున:ప్రారంభానికి తీసుకుంటున్న చర్యలను, అనుసరిస్తున్న వ్యూహాలను సైతం సీఎం కేసిఆర్ క్షుణ్ణంగా పరిశీలించి, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నియంత్రణలోకి వచ్చిందని వైద్యశాఖ నివేదికలు అందించడంతో సెప్టెంబర్ 1 నుంచి అంగన్ వాడి కేంద్రాలతో సహా అన్ని రకాల విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి తెలిపారు. కరోనా కారణంగా గత 16 నెలలుగా నిరంతరాయంగా పాఠశాలలు మూసివేయడంతో పిల్లల్లో మానసిక వత్తిడి పెరుగుతున్నదని, అది వారి భవిష్యత్తుపై ప్రభావం చూపే పరిస్థితి ఉండే నేపథ్యంలో సీఎం కేసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలు ప్రారంభిస్తున్న నేపథ్యంలో పారిశుద్ద్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ద చూపాలని, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రతి పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సిద్దం చేయాలని మంత్రి సూచించారు. ప్రతి పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట నూతనంగా మిషన్ భగీరథ ద్వారా పైప్ కనెక్షన్లు అందించాలని మంత్రి సూచించారు. పాఠశాలల్లో గల కిచన్ షెడ్డులను ప్రత్యేకంగా శుభ్రపరచాలని మంత్రి సూచించారు. విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్క విద్యార్థి తప్పని సరిగా మాస్కులు ధరించి పాఠశాలలకు రావాలని అన్నారు. జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలో కూడా పారిశుద్ద్య చర్యలు చేపట్టేలా జిల్లా విద్యాధికారులు పర్యవేక్షించాలని, ప్రైవేట్ పాఠశాలల బస్సులలో విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకొవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పాఠశాలలు ప్రారంభం అయిన తర్వాత ప్రతి రోజు కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులు, జిల్లా పంచాయితీ అధికారులు, ఎం.పి.డి.వో.లు, మండల విద్యాధికారులు, మండల పంచాయితీ అధికారులు పాఠశాలలను సందర్శిస్తూ పారిశుద్ద్య చర్యలను కొనసాగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పాఠశాలలో విద్యార్థి కోవిడ్ లక్షణాలతో ఉంటే వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించాలని ప్రధానోపాధ్యాయులను మంత్రి ఆదేశించారు. విద్యార్థికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన పక్షంలో విద్యార్థి తరగతి గదిలో ఉన్న ప్రైమరీ కాంటాక్ట్ విద్యార్థులను గుర్తించి అందరికి కొవిడ్ పరీక్షలు చేయించాలని మంత్రి సూచించారు. కోవిడ్ థర్డ్ వేవ్ వస్తుందనే భయందోళనలో తల్లితండ్రులు ఉన్నారని, విద్యార్థులను ఎవరిని బలవంతంగా పాఠశాలలకు తీసుకురావద్దని, కోవిడ్ నిబంధనల మేరకే స్వచ్చందంగా వచ్చే విద్యార్థులకు పాఠశాలల్లో అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు.
వీడియో కాన్పరెన్సులో పాల్గోన్న రాష్ట్ర పంచాయితీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, అన్ని విద్యాసంస్థల్లో పకడ్బందీ పారిశుద్ద్య చర్యలు చేపట్టి సెప్టెంబర్ 01న పాఠశాలలను ప్రారంభించాలని అన్నారు. ప్రతి రోజు పాఠశాలల్లో పారిశుద్ద్య చర్యలు గ్రామ పంచాయితీ ద్వారా నిర్వహించాలని ఆదేశించారు. పాఠశాల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించి, నిల్వ నీటిని లేకుండా మట్టి వేయించాలని అన్నారు. పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలు, విద్యార్థుల కమిటీలు ఏర్పాటు చేసి పరిశుభ్రమైన పరిసరాలలో పాఠశాలల్లో విద్యా భోదన చేయుటకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలోని అన్ని ప్రభుత్వ సంస్థలో పారిశుద్ద్య పనుల నిర్వాహణ బాధ్యత గ్రామ పంచాయితీలదేనని పంచాయితీరాజ్ చట్టంలో ఉందని మంత్రి అన్నారు. ప్రతి పాఠశాలల్లో త్రాగునీటి సరఫరా ఉండాలని, త్రాగునీరు లేని పాఠశాలకు వెంటనే సంబంధిత ఏఇలు సందర్శించి మిషన్ భగీరథ నళ్లాలు అమర్చాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో తాత్కాలిక మరమ్మత్తులు ఉంటే వెంటనే చేయించాలని అన్నారు. పారిశుద్ద్య చర్యల నిర్వహణలో నిర్లక్ష్యం వహించే అధికారులు, ప్రజాప్రతినిధుల పై కఠిన చర్యలు తీసుకుంటామని, విద్యార్థుల విషయంలో చిన్న తప్పును కూడా సహించే ప్రసక్తి ఉండదని మంత్రి హెచ్చరించారు. పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల డాక్టర్లతో సమన్వయం చేసుకోవాలని మంత్రి అన్నారు.
వీడియో కాన్పరెన్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. నిఖిల మాట్లాడుతూ, సెప్టెంబర్ 01 నుండి పాఠశాలల పునః ప్రారంభానికి అన్ని చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అవసరమైన పారిశుద్ద్య పనులు పూర్తి చేస్తామని, కోవిడ్ నియంత్రణ చర్యలని ఖచ్చితంగా అమలుచేస్తామని ఆమె అన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో స్పెషల్ డ్రైవ్ ద్వారా పారిశుద్ద్య చర్యలు నిర్వహించుటకు జిల్లా విద్యాధికారికి, జిల్లా పంచాయితీ అధికారికి, మండల విద్యాధికారులకు, ఎంపిడివోలకు, మండల పంచాయితీ అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. పాఠశాలల్లో మిషన్ భగీరథ ద్వారా త్రాగు నీరు సరఫరాకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) అబ్దుల్ హమీద్, జనగామ మునిసిపల్ చైర్ పర్సన్ పోకల జమున, జెడ్పి సిఇవో ఎల్. విజయలక్ష్మి, డిఇఓ కె. రాము, డిపివో కె. రంగాచారి, డిఆర్డీవో జి. రాంరెడ్డి, జనగామ ఎంపిపి మేకల కళింగరాజు, నెల్లుట్ల ఎంపిపి చిట్ల జయశ్రీ, మున్సిపల్ కమిషనర్ నర్సింహ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి, జనగామచే జారీచేయనైనది.