హుజురాబాద్ ఉపఎన్నిక కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలి
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్
కౌంటింగ్ ప్రక్రియపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్
00000
హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ను కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం సజావుగా, పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ అన్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి మంగళవారం నిర్వహించనున్న కౌంటింగ్ ప్రక్రియ పై జిల్లా ఎన్నికల అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శశాంక్ గోయల్ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి పొరపాట్లకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలను భద్రంగా కౌంటింగ్ టేబుల్స్ వద్దకు తీసుకురావాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిశాక రాష్ట్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందజేయాలని తెలిపారు.
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్ వి కర్ణన్ మాట్లాడుతూ హుజురాబాద్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ను కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలలో ఈ నెల 2వ తేదీ న నిర్వహించనున్నామని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని తెలిపారు. కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకునీ సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ నిర్వహిస్తామని అన్నారు. కోవిడ్ నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే కౌంటింగ్ సిబ్బంది అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారని, మరొక్కసారి వారందరికీ రాపిడ్ పరీక్షలు కూడా నిర్వహించామని తెలిపారు. కౌంటింగ్ సిబ్బందికి రెండవ దఫా శిక్షణ సోమవారం అందజేశామని అన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే కౌంటింగ్ ప్రక్రియలో ముందుగా కౌంటింగ్ ఏజెంట్లు సమక్షంలో పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తామని తెలిపారు. అనంతరము ఈవీఎం లలోని ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. కౌంటింగ్ కేంద్రంలో రెండు హాల్స్ లలో 14 టేబుల్స్ ఏర్పాటు చేశామని, ప్రతి టేబుల్ కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, కౌంటింగ్ అబ్జర్వర్, మైక్రో అబ్జర్వర్ ఉంటారని అన్నారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని తెలిపారు.
పోలీస్ కమిషనర్ వి. సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి, ఆర్ డి ఓ సిహెచ్. రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.