వెనుకబడిన నారాయణపేట జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు జిల్లా అధికారులు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి తమవంతు కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్మన్ వనజమ్మ సూచించారు. శుక్రవారం స్థానిక షీలా గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఆమె అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి మక్తల్ శాసన సభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ లోకల్ బాడీ కె. చంద్రా రెడ్డి, అదనపు కలెక్టర్ పద్మజా రాణి, జడ్పి డిప్యూటి సి.ఈ.ఓ జ్యోతి వేదిక పై ఆసీనులు కాగా వైరల్ జ్వరంతో బాధపడుతున్న జిల్లా కలెక్టర్ హరిచందన హాజరుకాలేదు. ఈ సందర్బంగా జడ్పి చైర్మన్ మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందని ఇందుకు జిల్లా అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకొని కేంద్ర, రాష్ట ప్రభుత్వం ద్వారా ప్రవేశ పెడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమావేశానికి అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్దేశిత సమయానికి హాజరు కావాలని, సభ ఆలస్యముగా ప్రారంభం కావడం వల్ల కొన్ని శాఖల పై చర్చించకుండా పోయామని తెలిపారు.
ఈ సమావేశంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, విద్యుత్తు, విద్యా, వైద్యం, మిషన్ భగీరథ, రోడ్లు భవనాలు, అటవీశాఖ, పశు సంవర్ధక శాఖ వంటి ముఖ్యమైన శాఖల పై వాడి వేడిగా చర్చ జరిగింది. ముఖ్యంగా విద్యుత్ శాఖ పై చర్చ సందర్బంగా మక్తల్ శాసన సభ్యులు మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో లైన్ మెన్ లు, ఆపరేటర్లు సరిగ్గా పనిచేయడం లేదని, ఇష్టం వచ్చినట్లు ఎల్.సి లు తీసుకోవడం వల్ల విద్యుత్ ఎప్పుడు ఉంటదో ఎప్పుడు పోతదో తెలువకుండా పోతుందన్నారు. ఇష్టం వచ్చినట్లు ఎల్.సి. తీసుకోవడం వల్ల ఎలక్ట్రానిక్ పరికరాలు, బల్బులు పాడైపోతున్నాయని దీనిని నివారించాలని విద్యుత్ అధికారిని ఆదేశించారు. కొన్ని చోట్ల ఇనుప స్తంభం పై విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ఏర్పాటు చేయడం, తీగ చెట్లు పైకి పాకీ ట్రాన్స్ఫార్మర్, విద్యుత్ తీగలకు చుట్టుకోవడం వల్ల విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా విద్యా శాఖ సమీక్ష సందర్బంగా విద్యా శాఖ అధికారి సభకు హాజరు కాకపోవడం, జిల్లా కలెక్టర్ సైతం హాజరు కాకపోవడం పై శాసన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సర్వ సభ్య సమావేశంలో అన్ని శాఖల పై ప్రజా ప్రతినిధుల సమక్షంలో చర్చ జరుగుతుందని ఇంతటి ముఖ్యమైన సమావేశానికి కలెక్టర్, అధికారులు హాజరుకాకపోవడం ఏమిటని ప్రశ్నించారు. మక్తల్ లో జరిగిన మున్సిపల్ సమావేశానికి సైతం కలెక్టర్ గాని ఆదనపు కలెక్టర్ గాని హాజరు కాలేదన్నారు. ఊట్కూరు మండలం తిప్రాస్ పల్లి లో ఇదివేరకె భూసేకరణ జరిపి రెండు మూడు సార్లు పరిహారం సైతం తీసుకున్న వ్యక్తి ఇప్పటికి భూమి ప్రభుత్వానికి అప్పజెప్పాడానికి ఇబ్బందులు సృష్టిస్తున్నాడాని క్రీడా ప్రాంగణం కొరకు కేటాయించిన స్థలంలో వారి నాట్లు వెయిస్తున్నాడని ఊట్కూరు ఎంపిపి అశోక్ తో పాటు శాసన సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థలంలో బోర్డు ఎందుకు పెట్టడం లేదని అడిగారు.
స్పందించిన అదనపు కలెక్టర్ కె. చంద్రా రెడ్డి, జిల్లా కలెక్టర్ కు వైరల్ జ్వరం కరణంగా అస్వస్థతకు గురై సెలవు పెట్టినట్లు సభకు వివరించారు. మున్సిపల్ సమావేశం బడ్జెట్ కు సంబంధించి జరిగితే కలెక్టర్ లేదా ఆదనపు కలెక్టర్ తప్పకుండా హాజరు అవుతారని, సాధారణ సమావేశానికి కలెక్టర్ లేదా ఆదనపు కలెక్టర్ తప్పకుండా హాజారు కావాల్సిన అవసరం లేదని తెలియజేసారు. తిప్రాస్పల్లి క్రీడా ప్రాంగణం స్థలంలో వెంటనే రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, రికార్డులు క్షున్నంగా పరిశీలించి ఒకవేళ ఇప్పటికే భూపరిహారం ఇచ్చి ఉంటే అట్టి స్థలాన్ని స్వాధీనం చేసుకొని బోర్డు పెట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ పాటిబెచడం లేదని సభ్యులు సభా దృష్టికి తెచ్చిన విషయం పై మాట్లాడుతు ప్రోటీకాల్ విషయంలో ఇప్పటికే స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని ఎక్కడైన ఉల్లంఘన జరిగినట్లు ఉంటే రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా బాధ్యుల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్ చెట్లను నరికివేస్తున్న విషయం పై మాట్లాడుతూ అనుమతి లేకుండా చెట్లు నరినట్లయితే అటవీ శాఖ వాల్టా చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
ఈ సమావేశంలో ఊట్కూరు జడ్పిటిసి అశోక్ గౌడ్ పలు అంశాలను సభా దృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్ అధికారులు ఉన్న ఫెన్సింగ్ తీసి మరోచోట పెట్టుకోని బిల్లులు స్వాహా చేస్తున్నారని మండల అధికారులకు సమాచారం ఇవ్వకుండానే లైన్ మెన్ లను మార్చడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్న్నారు. ఆరోగ్య శాఖ ద్వారా ప్రతి సంవత్సరం గ్రామ పంచాయతీలకు రావాల్సిన శానిటేషన్ నిధులు రావడం లేదని వాటిని ఎక్కడ ఖర్చు చేస్తున్నారో అర్థం కావడం లేదని సభ దృష్టికి తెచ్చారు.
నారాయణపేట ఎంపిపి ఏ. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మండల స్థాయిలో మెడికల్ అధికారులు, విద్యుత్ అధికారులు సమావేశాలు నిర్వహించి అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యుత్ కాంట్రాక్టర్లు చర్చిస్తే సమస్యలు చర్చకు వచ్చి పరిష్కారం అవుతాయన్నారు. మండల స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేయాలని సభ ఆమోదించింది.
దామరగిద్ద ఎంపిపి, కో అప్షన్ మెబర్ తాతుద్దీన్, జడ్పి వైస్ చైర్మన్ సురేఖమ్మ, మాగనూర్ ఎంపిపి సైతం మాట్లాడి పలు అంశాలు సభ దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ పద్మజా రాణి, ఆర్.డి.ఓ రాంచందర్ నాయక్, జడ్పి టీసీలు, ఎంపిపి లు, కో అప్ట్షన్ మెంబర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.