ప్రచురణార్థం…. 1
తేదీ.01.02.2023
సకల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి:: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
21.07 లక్షలతో పాఠశాలలో అభివృద్ధి పనులు పూర్తి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు
అంగన్వాడీ భవన నిర్మాణానికి 10 లక్షల నిధులు మంజూరు
పాఠశాల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి
రేగోండ మండల లింగాల గ్రామంలో ఎంపిపిఎస్ పాఠశాలలో మన ఊరు మనబడి పనులను జిల్లా కలెక్టర్ తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్యే
రేగోండ/ లింగాల, ఫిబ్రవరి 1
జిల్లాలో సకల సౌకర్యాలతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.బుధవారం రేగొండ మండలం లింగాల గ్రామంలో మన ఊరు–మనబడి పథకం కింద పునరుద్ధరించిన ప్రభుత్వ పాఠశాలలను జిల్లా కలెక్టర్,తో కలిసి స్థానిక ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యారంగం అభివృద్ధి చెందితే ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని, దేశంలో అభివృద్ధి చెందిన విద్యారంగ ఫలితంగా ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీలకు మన భారతీయులు సీ.ఈ.ఓ.లుగా విధులు నిర్వహిస్తున్నారని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రైవేట్ రంగానికి దీటుగా ప్రభుత్వ రంగంలో పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు మనబడి కార్యక్రమాన్ని రూపొందించారని, గత సంవత్సరం 2 వేల కోట్ల నిధులతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 30 కోట్ల పైగా నిధులతో 141 పాఠశాలల్లో మన ఊరు మనబడి పనులు జరుగుతున్నాయని, ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన ఖర్చులకు అనుగుణంగా ఫలితాలు సాధించాలని, పాఠశాలల్లో అదనపు సౌకర్యాలు కల్పిస్తున్నామని అధిక సంఖ్యలో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు రావాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగం, వైద్యరంగం, విద్యారంగం అన్ని రంగాల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకొని అమలు చేస్తుందని, ఇటీవలే కంటి వెలుగు కార్యక్రమాన్ని సైతం ప్రారంభించిందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రపంచంలో చిన్న దేశమైన సింగపూర్ ను అక్కడి నాయకత్వం చిత్తశుద్ధితో పనిచేయడం వల్ల అత్యుత్తమ దేశంగా మలిచిందని, అదే విధంగా మన రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు.
గ్రామంలో నిర్మించిన పాఠశాల నిర్వహణ బాధ్యత పంచాయతీ తీసుకోవాలని, పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రభుత్వం అందించిన సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామ కేంద్రంలో అంగన్వాడి భవన నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఎమ్మెల్యే నిధుల నుంచి మంజూరు చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.
జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ గత సంవత్సరం మన ఊరు మనబడి కార్యక్రమం కింద జిల్లాలో 141 పాఠశాలలో పనులు చేపట్టామని, పాఠశాలలో అవసరమైన 12 రకాల మౌలిక వసతులు కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
గ్రామంలోని మండల ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధి హామీ పనుల కింద 11 లక్షలు, మన ఊరు మనబడి కింద 10 లక్షల 7 వేల రూపాయలు మొత్తం 21 లక్షల 7 వేల నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని తెలిపారు.
పాఠశాలను ఆకర్షణీయంగా తయారు చేస్తున్నామని, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రారంభించామని, ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు.
కార్యక్రమం ముందుగా విద్యార్థులచే ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి ఆనందించినారు అదే పాఠశాలకు చెందిన ఆరో తరగతి విద్యార్థి తయారుచేసిన జెసిబి ఎంత పరికరాన్ని పరిశీలించి విద్యార్థులను అభినందించినారు. అనంతరం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించి వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ టీఎస్ దివాకర, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బుర్ర రమేష్ గౌడ్, డి.ఈ. ఓ. రాం కుమార్ ,మండల ప్రత్యేక అధికారి సిపిఓ శామ్యూల్ ,ఎంపీడీవో, తాహసిల్దార్ స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి , జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది.