సమాజంలో కుల వివక్షత అంటరానితనం వంటి దూరాచారాలు పూర్తిగా రూపుమాపేందుకు విజిలెన్స్ అండ్ మానిటరింగ్ యాక్టు పై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించేందుకు బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్/జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ హాల్లొ నారాయణపేట జిల్లాలో మొదటి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేయగా కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ.డి.ఎస్సి కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు, లైన్ డిపార్ట్మెంట్ అధికారులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నారాయణపేట జిల్లా ఏర్పడ్డాక గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ సమావేశం ఏర్పాటు చేయలేక పోయామని ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే ఈ సమావేశం నేడు మొదటి సమావేశమని తెలిపారు. జిల్లాలో కుల వివక్షత,ఎస్సి ఎస్టీ ల పై జరిగిన అత్యాచారాలు, వేధింపులు, భౌతిక దాడులు వంటి రుగ్మతలను అరికట్టి అలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటి పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నెల గ్రామాల్లో పోలీస్, రెవెన్యూ ఇతర శాఖల సమన్వయంతో సివిల్ రైట్స్ డే నిర్వహించాలని ఆదేశించారు. చట్టం పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఆయా శాఖలు కృషి చేయాలని లైన్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పూర్తిగా నిషేధించిన జోగిని దురాచారం ఎక్కడైన జాతరలో జరిగే ప్రమాదం ఉన్నందున స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, పోలీసు శాఖ సమన్వయంతో ముందే పసిగట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వీటిని అరికట్టేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ నుండి కళాబృందాలు ఇప్పటికే గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలియజేసారు. ఎస్సి ఎస్టీల సామాజిక, ఆర్ధిక అభివృద్ధికి గురుకులాల్లో నాణ్యమైన విద్య, స్కాలర్షిప్ లు, బ్యాంకు రుణాలు, రైతుబందు, దళితబంధు, సబ్సిడీ పై విత్తనాలు, గిరి వికాస్ తదితర పథకాలు అమలు చేస్తున్నట్లు తెలియజేసారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, సలహాలు, సూచనలు ఉంటే చేయాలని సంఘ నాయకులను కోరారు.
ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ ఎన్. వేంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎక్కడైన ఎస్సి ఎస్టీ లపై అత్యాచారం, దాడులు జరిగితే వెంటనే ఎస్సి ఎస్టీ కేసులు బుక్ చేసి బాధితులకు రావలసిన పరిహారం, న్యాయం ఇప్పించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎఫ్.ఐ.ఆర్ అనంతరం పరిహారం ఇప్పించడం తో పాటు త్వరగా చార్జీ షీట్ వేసి బాధితులకు పూర్తి పరిహారం, పూర్తి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామ, మండల స్థాయిలో ఎక్కడైన దీనికి విరుద్ధంగా పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వహించిన, ఎస్సి ఎస్టీ కేసులను సివిల్ కేసులుగా కావాలని మార్చే ప్రయత్నం చేసినా అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సైతం వెనుకాడమని, బాధితులకు న్యాయం చేసేందుకు కట్టుబడి ఉన్నామని భరోసా కల్పించారు. నారాయణపేట జిల్లాలో 2019 లో మొత్తం 32 కేసులకు ఎఫ్.ఐ.ఆర్ అనంతరం మొదటి స్టేజి పరిహారం కొరకు జిల్లా కలెక్టర్ కు ప్రతిపాదనలు పంపిస్తే 25 మందికి రూ. 12,12,500 పరిహారం మంజూరు అయ్యాయని 7 కేసులు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. రెండవ స్టేజి లో 14 మందికి రూ. 14,62,500 మంజూరు అయ్యాయని, 2020 సంవత్సరంలో 21 కేసులకు గాను 12 కేసులకు 10,87,500 పరిహారం, రెండవ స్టేజ్ లో 16 కేసులకు గాను 7 మంది బాధితులకు రూ. 8,50,000 పరిహారం అందినట్లు తెలిపారు. 2021 సంవత్సరంలో 27 కేసులకు గాను 18 మందికి, 2022 లో 28 కేసులకు గాను నలుగురు బాధితులకు పరిహారం అందినట్లు గణాంకాలు తెలియజేసారు.
ఈ సమావేశంలో ఆదనపు కలెక్టర్ కె. చంద్రా రెడ్డి, జిల్లా సాంఘీక సంక్షేమ అభివృద్ధి శాఖ అధికారి కన్యాకుమారి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి రామ్ మనోహర్ రావు, డి.ఎస్పీ సత్యనారాయణ, వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, పి.డి డి.ఆర్.డి.ఏ గోపాల్ నాయక్, డి.పి.ఓ మురళి ఇతర జిల్లా అధికారులు, సంఘ నాయకులు, జుట్ల శ్రీనివాసులు, ఆశప్ప, దినేష్ వర్మ, కిష్ట్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.