ప్రెస్ నోట్
సిద్దిపేట 23 డిసెంబర్ 2022.
ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించే వంగడాల ఉత్పత్తి లక్ష్యంగా పరిశోధనలు నిర్వహించాలని రాష్ట్ర గవర్నర్ మరియు శ్రీ కొండ లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం చాన్సులర్ తమిళిసై సౌందరరాజన్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులకు పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ములుగు లో గల శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం రెండవ సాధనోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు డిగ్రీ పట్టాలను, పీహెచ్డీ చేసిన వారికి డాక్టరేట్ పట్టాలను అందజేశారు.
అనంతరం విద్యార్థులనుద్దేశించి గవర్నర్ మాట్లాడుతూ ఉద్యాన రంగం వ్యవసాయ రంగానికి మూల స్తంభం లాంటిదని, ఎలాంటి అనారోగ్యాలు లేకుండా గత తరం మనుషులు ఎలాంటి ఆహారం తీసుకొని ఆరోగ్యవంతంగా బతికారో అలాంటి ఆరోగ్యవంతమైన పంటలను పండించడానికి ఉద్యాన విద్యార్థులు విస్తృతమైన పరిశోధనలు జరపాలని అన్నారు. గతంలో వివిధ రకాలైన వరి ధాన్యాలను వివిధ సందర్భాల్లో ఆహారంగా తీసుకునే వాళ్ళు కానీ ప్రస్తుతం పాలిష్ చేసిన వరి బియ్యంతో చేసిన వంటలను ఆహారంగా తీసుకోవడం మూలంగా శరీరానికి అవసరమైన ప్రోటీన్లను పొందలేకపోతున్నాము. కరోనా వైరస్ పౌష్టికాహారం విలువను ప్రపంచానికి తెలిసింది. మానవాళికి ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించే వంగడాల సృష్టి జరిగేలా ఉద్యాన విద్యార్థులు నిరంతరం పరిశోధనలు నిర్వహించాలి. శాకాహారం, పండ్లు, పూల వలన మానవాళికి జరిగే లాభాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. నెగిటివ్ ఆలోచనలు మాని పాజిటివ్ గా ఆలోచించి విశ్వవిద్యాలయంలో కల్పించిన సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడేలా నైపుణ్యాన్ని సాధించాలని ఈ సందర్భంగా గవర్నర్ విద్యార్థులకు సూచించారు.
ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ నీరజ ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేసిన ఈ విశ్వవిద్యాలయం 8 సంవత్సరాల వ్యవధిలో సాధించిన విజయాలను, విద్యార్థులకు అందజేసిన కోర్సుల వివరాలను, జరిగిన పరిశోధనలను వివరించారు.
భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (హార్టికల్చర్) డా. ఆనంద్ కుమార్ సింగ్ మాట్లాడుతూ దేశంలో సగం జనాభా వ్యవసాయం మరియు వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉందని వ్యవసాయ రంగానికి ఉద్యాన పంటలు తోడైనప్పుడు మాత్రమే రైతులు అభివృద్ధి సాధిస్తారని అన్నారు. దేశం ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఉద్యాన పంటల పండించే జాబితాలో ఉందని ప్రభుత్వం సమీకృత ఉద్యాన వన అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు
ఈ రెండవ శాతకోత్సవంలో 482 అండర్ గ్రాడ్యుయేట్, 76 పోస్ట్ గ్రాడ్యుయేట్, 17 పీహెచ్డీ పట్టాలు, అండర్ గ్రాడ్యుయేట్ లో మూడు బ్యాచ్ లకు మూడు యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్, పీజీ లో రెండు బ్యాచ్ లకు రెండు యూనివర్సిటీ గోల్డ్ మెడల్స్ అలాగే పీజీలో మరో ఆరు స్పాన్సర్ గోల్డ్ మెడలు కలిపి మొత్తంగా పదకొండు బంగారు పతకాలను గవర్నర్ విద్యార్థులకు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ రిజిస్టర్ భగవాన్, ప్రొఫెసర్లు, అండర్ గ్రాడ్యుయేషన్, గ్రాడ్యుయేషన్, పిహెచ్డి విద్యార్థులు, పేరెంట్స్, యూనివర్సిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
డిపిఆర్ఓ సిద్దిపేట వారిచే జారీ చేయడమైనది.