స్పెషల్ సమ్మరి రివిజన్ 2022 ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 1వ తేదీన అన్ని జిల్లాల్లో విడుదల చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లు అదనపు కలెక్టర్లతో ఎస్.ఎస్.ఆర్-2022 పై వీడియో కాన్ఫెరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్, 30వ తేదీ వరకు వచ్సిన ఓటర్ల నమోదు, తొలగింపు, మార్పులు తదితర దరఖాస్తులను పరిష్కరించి నవంబర్, 1వ తేదీన ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించాలని సూచించారు. ముసాయిదా కాపీలను అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉంచాలని, ఓటర్లకు ఓటరు జాబితాలో ఏమైనా పేర్లలో మార్పులు, ఫోటో లేకపోవడం తదితర సమస్యలు ఉంటే దర్సఖాస్తులు స్వీకరించి నవంబర్ 2వ తేదీ నుండి సరిదిద్దే కార్యక్రమం చేపట్టాలని తెలిపారు. ఓటర్ల అభ్యంతరాలను పరిష్కరించి 2022 జనవరి, 5వ తేదీన తుది ఓటరు జాబితాను ప్రచురించాల్సిందిగా సూచించారు. ఓటర్లు నివాసం మారడం వల్ల పోలింగ్ స్టేషన్లు అదనంగా అవసరం ఉన్నా లేక పోలింగ్ కేంద్రం వేరే చోటికి మార్చవలసినవి ఉన్న యెడల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఆమోదంతో తగు మార్పులకు సిఫారసు చేయవచ్చన్నారు. ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల వివరాలు ఓటర్ల మార్పు చేర్పులు చేసుకోడానికి గరుడ యాప్ ను ఇవ్వడం జరిగిందని, ఈ యాప్ ఎలా ఉపయోగించాలో బి.యల్.ఓ లకు పూర్తి శిక్షణ ఇవ్వాల్సిందిగ సూచించారు. ఇ. వి.యం లు పాత గోదాముల నుండి కొత్త గొదాములకు మార్చాలని తెలిపారు. ఇంకా నిర్మాణం పూర్తి చేయని జిల్లాల్లో త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. ఇ. వి.యం.ల భద్రత పై క్రమం తప్పకుండా పర్యవేక్షణ చేయాలన్నారు. అన్నీ జిల్లాల్లో స్వీప్ యాక్టివిటి నిర్వహించి ఓటర్లను చైతన్యవంతులను చేయాలని సూచించారు. జనవరి, 1 2022 నాటికి 18 సంవత్సరాలు పూర్తి అయ్యే ప్రతి యువతి యువకులు ఆన్లైన్ ద్వారా గాని ఫారం 6 ద్వారా కానీ ఓటరు జాబితాలో తమ పెరు నమోదుకు దరఖాస్తు చేసుకునే విధంగా ప్రచారం గావించాల్సిందిగా సూచించారు. గత ఎన్నికలకు సంబంధించి ఖర్చు చేసిన ఎన్నికల బిల్లులు, డి.సి. బిల్లులు పెట్టడం పెండింగ్ ఉంటే సత్వరమే దాఖలు చేయాలని తెలియజేసారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అదనపు కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ద్వారా ఇచ్చిన సలహాలు సూచనలు పాటిస్తామని, జిల్లాలో ఓటరు నమోదుకు, పేర్లు మార్పుకు వచ్చిన దరఖాస్తులు దాదాపు అన్ని పరిష్కరించడం జరిగిందన్నారు. నవంబర్ 1న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసారు.