స్మార్ట్ సిటీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
జిల్లా కలెక్టర్ ఆర్. వి.కర్ణన్
నగరంలో జరుగుతున్న స్మార్ట్ సిటీ పనులను పరిశీలించిన కలెక్టర్
000000
కరీంనగర్ లో చేపడుతున్న స్మార్ట్ సిటీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, స్మార్ట్ సిటీ కన్సల్టెన్సీ ప్రతినిధులను ఆదేశించారు.
మంగళవారం మున్సిపల్ కమిషనర్, ఇంజనీరింగ్ అధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులతో కలిసి నగరంలోని టవర్ సర్కిల్, మంచిర్యాల చౌరస్తా, ఆదర్శనగర్, కిసాన్ నగర్, ఇందిరానగర్ తదితర ప్రాంతాలలో సిసి రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, ఫుట్ పాత్ లను పరిశీలించారు. పనులకు అడ్డంకిగా ఉన్న ఎలక్ట్రిక్ స్తంభాలను పరిశీలించారు. అనంతరము కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది, స్మార్ట్ సిటీ కన్సల్టెన్సీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ ప్యాకేజీ 1, 2 పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభించి అసంపూర్తిగా ఉన్న వాటిని పూర్తిచేయాలని సూచించారు. స్మార్ట్ సిటీ రోడ్ల వెడల్పు పనులకు అడ్డంకిగా ఉన్న ఇళ్ల తొలగింపు పనులను సంబంధిత ఇంటి యజమానులతో మాట్లాడి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎక్కడ కూడా స్మార్ట్ సిటీ పనులు నిలిపి వేయవద్దని అన్నారు. టవర్ సర్కిల్ ప్రాంతంలో స్మార్ట్ సిటీ పనులకు అడ్డంకిగా ఉన్న కరెంటు స్తంభాలను విద్యుత్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకొని స్తంభాల ను తొలగించాలని సూచించారు. డ్రైనేజీ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. భగత్ నగర్ విగ్రహం నుంచి రామచంద్రాపూర్ కాలనీ వరకు, అంబేద్కర్ స్టేడియం నుంచి కట్ట రాంపూర్ మీదుగా గౌతమి నగర్ వరకు, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి సిడబ్ల్యుసి గోదాం వరకూ, బ్రిలియంట్ పాఠశాల నుంచి షాలిమార్ ఫంక్షన్ హాల్ వరకు, దోబీ ఘాట్ నుంచి సప్తగిరి కాలనీ వరకు నిర్మాణంలో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. టవర్ సర్కిల్ వద్ద అండర్ గ్రౌండ్ కేబుల్ ( ఎలక్ట్రికల్) పనులు సత్వరమే పూర్తి చేయాలని అన్నారు. స్మార్ట్ సిటీ లో భాగంగా కూడళ్లను (జుంక్షన్లు) ఆధునీకరించాలని తెలిపారు. జుంక్షన్లలో రాత్రి సమయంలో ఎవరు నిదురించ కుండా చూడాలని, అలా నిదురించే వారిని నైట్ షేల్టర్లకు పంపించాలని ఆదేశించారు. రోజువారీగా చేపడుతున్న స్మార్ట్ సిటీ పనుల ఫోటోలను తనకు ప్రతిరోజు పంపించాలని అధికారులకు సూచించారు. స్మార్ట్ సిటీ పనులలో అలసత్వం ప్రదర్శించే అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.