10వ తరగతి పబ్లిక్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలి
ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఏఎన్ఎం. అందుబాటులో ఉండాలి
పరీక్షల దృష్ట్యా ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపాలి
పోలీస్ బందోబస్తుతో ప్రశ్నపత్రాల తరలించాలి
విద్యార్థులు మానసిక ఒత్తిడి గురికాకుండా ప్రశాంతంగా పరీక్ష రాసేలా చర్యలు
రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
00000
పదవ తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
బుధవారం పదవ తరగతి పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ సెక్రెటరీ వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన, ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులతో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, ఇంటర్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించినందుకు అధికారులకు అభినందనలు తెలిపారు. ఏప్రిల్ 3 నుండి 13 వరకు జరుగు పదవతరగతి పరీక్షల నిర్వహణకు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 90 వేల మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలకు హాజరవుతారని, దాదాపు 2 వేల 600 పైగా కేంద్రాల్లో పరీక్షలను నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. 10వ తరగతి పరీక్షలో గతంలో ఉన్న 11 పేపర్లను ప్రస్తుతం 6 పేపర్లుగా కుదించామని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని తెలిపారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద తప్పనిసరిగా ఏఎన్ఎం అందుబాటులో ఉంచాలని మంత్రి పేర్కొన్నారు.
పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు రవాణా కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఉదయం, మధ్యాహ్నం నడపాలని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి అన్నారు. వేసవి కాలంలో పరీక్షలు నిర్వహిస్తున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.
విద్యార్థుల హాల్ టికెట్ లను (bse.telangana.gov.in) వెబ్ సైట్ లో ఉంచామని, విద్యార్థులు డౌన్ లోడ్ చేసుకోవాలని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు పరీక్ష హాల్లో త్రాగునీరు అందించాలని, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
10వ తరగతి పరీక్షా కేంద్రాలకు ఎవరు సెల్ ఫోన్ లేదా ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకుని వెళ్లడానికి వీలు లేదని స్పష్టం చేశారు. పరీక్షల సమయంలో విద్యార్థులు అధికంగా మానసిక ఒత్తిడికి గురికాకుండా, ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని, విద్యార్థులకు అవసరమైన ప్రోత్సాహన్ని అందించాలని తెలిపారు.
విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ మాట్లాడుతూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసుకోవాలని, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని తెలిపారు.
గతంలో ఉన్న 11 పరీక్షలను ప్రస్తుతం 6 పరీక్షలకు కుదించామని, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ మినహాయించి ప్రతి పరీక్ష ఉదయం 9.30 నుంచి 12.30 జరుగుతాయని, ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్స్, సైన్స్ పరీక్షలు 9.30 నుంచి 12.50 వరకు జరుగుతుందని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్ లకు సూచించారు.
ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ మాట్లాడుతూ, జిల్లాలో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్న 12195 మంది విద్యార్థుల కొరకు 78 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశామని, తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని అన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా బాధ్యతలను గ్రామ పంచాయతీ లకు, మున్సిపాలిటీలకు అప్పగించామని అన్నారు.10వ తరగతి పరీక్షల కోసం జిల్లాలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసామని తెలిపారు. సెట్ 1 మరియు సెట్ 2 పేపర్లను సంబంధిత పోలీస్ స్టేషన్లు, డిటిఓ లో భద్రపరచడం జరుగుతుందని తెలిపారు. పరీక్షా కేంద్రానికి 15 కి.మి. తరువాత ఉన్న పోలీస్ స్టేషన్లు 18 గా గుర్తించడం జరిగిందని పేర్కోన్నారు. పరీక్షలు సజావుగా ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా పటిష్టమైన ఏర్పాట్లను చేయడం జరిగిందని పేర్కోన్నారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు , డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ల త్రియాంబాకేశ్వర్ రావు, డిడి ట్రెజరి శాఖ అధికారి నాగరాజు, పోలీస్, పోస్టల్, విద్యుత్, టిఎస్ ఆర్టీసి మరియు సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.