ప్రచురణార్ధం
మహబూబాబాద్, ఆగస్ట్-09:
ఈ నెల 15న ఎన్.టి.ఆర్. స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అన్ని శాఖల అధికారులతో జరిపిన సమావేశంలో మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు తమ ఉద్యోగులు, సిబ్బందితో కలిసి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో తప్పనిసరిగా పాల్గొనాలని ఆదేశించారు. ఎన్.టి.ఆర్. స్టేడియంను అందంగా తీర్చిదిద్దాలని, బారికేడింగ్, బందోబస్తు చేసి స్వాతంత్య్ర సమరయోధులు, అతిథులు, ప్రముఖులు, పాత్రికేయులు, విద్యార్ధులు వేడుకలను తిలకించుటకు అనువుగా టెంట్ లను ఏర్పాటు చేయాలని తెలిపారు. అత్యవసర వైద్య సేవలు అందించుటకు ప్రథమ చికిత్స కేంద్రంతో పాటు, అంబులెన్స్ ను, వైద్య నిపుణులను అందుబాటులో ఉంచాలని తెలిపారు. నిరంతర విద్యుత్ సరఫరాకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
ఆయా శాఖలు అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై స్టాల్స్ ఏర్పాటు చేయలని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టరేట్, కలెక్టర్ క్యాంప్ కార్యాలయాలను విద్యుధ్దీపాలతో అలంకరించాలని అధికారులను ఆదేశించారు. సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని, వివిధ శాఖలచే శకటాల ప్రదర్శన నిర్వహించాలని, ఉత్తమ సేవలందిస్తున్న ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను జారీచేయుటకు పేర్లు తెలపాలని అధికారులకు సూచించారు. అగ్నిమాపక శాఖ ద్వారా ఫైర్ ఇంజన్ ను వేడుకలు జరుగు ప్రదేశంలో ఫైర్ సిబ్బందితో పాటు ఉంచాలని తెలిపారు. ప్రభుత్వంచే జారీ చేయబడు సర్క్యులర్ ప్రకారం ఇతర మార్పులను, ఏర్పాట్లను చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ పరిపాలనాధికారి, తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి, మహబూబాబాద్ కార్యాలయంచే జారీచేయనైనది.