2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు హరీష్ రావు

ప్రచురణార్థం —-2

తేదీ.3.1.2023

2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి:: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు హరీష్ రావు

జయశంకర్ భూపాలపల్లి జనవరి 3:-

రాష్ట్ర వ్యాప్తంగా జనవరి 18 నుండి నిర్వహించు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో కంటి వెలుగు కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మొదటి విడతలో 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసినట్లు తెలిపారు.54 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేసినట్లు వివరించారు.

కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలని కోరారు. మంత్రులు, శాసనసభ్యులు, జెడ్పి చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, వార్డు సభ్యులు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు.

ఈనెల 12లోగా జిల్లా స్థాయిలో మంత్రులు కంటి వెలుగు పై సమీక్ష సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మండల స్థాయిలో, మున్సిపల్ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. జనవరి 18న ప్రతి నియోజకవర్గంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని శాసనసభ్యులు ప్రారంభించే గ్రామాలను ఎంపిక చేయాలని కోరారు. కంటి వెలుగు కోసం రాష్ట్రవ్యాప్తంగా 1500 బృందాలను సిద్ధం చేశామని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల వృద్ధులకు ఈ కార్యక్రమం వల్ల ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

సోమేష్ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి దయాకర్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు మాట్లాడారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ భవేస్ మిశ్రా మాట్లాడుతూ. జిల్లాలో 25 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లో, గ్రామాల్లో శిబిరాలు ఏర్పాటు చేసే స్థలాలను ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రజా ప్రతినిధుల, అధికారుల సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని పేర్కొన్నారు.

కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర, మునిసిపల్ ఛైర్పెర్సన్ వెంకట రాణి సిద్దూ, డి ఆర్ డి ఓ పురుషోత్తం,జెడ్పి సీఈవో రఘువరన్, జిల్లా వైద్యాధికారి డా.శ్రీరామ్, డిఎల్ పిఓ సుదీర్ అధికారులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జయశంకర్ భూపాలపల్లిచే జారీ చేయనైనది.

Share This Post