30.08.2021 Nalgonda Dist Press Note

భారీ వర్షాలు కురుస్తున్నందున రెవిన్యూ, పోలీస్, ఇరిగేషన్ అధికారులు ముందస్తు ఏర్పాట్లతో అప్రమత్తంగా ఉండాలని, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగకుండా ఎప్పటికప్పుడు పరిస్థితులను పరిశీలించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్  జిల్లా కలెక్టర్లు,  పోలీస్ కమిషనర్లు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్లను ఆదేశించారు.
సోమవారం నాడు ఆయన  గత రెండు రోజుల నుండి కురుస్తున్న వర్షాల కారణంగా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర డీజీపీ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల వారీగా సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,  ఈ సంవత్సరం కురిసిన భారీ వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులు, డ్యాములు నిండాయని, అదేవిధంగా గత రెండు మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షాల వలన ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని,  రేపు కృష్ణాష్టమి సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నా కూడా అధికారులందరూ తమ హెడ్క్వార్టర్స్ లోనే ఉండి పరిస్థితులను పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలని ఆదేశించారు.  లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. గ్రామ పంచాయితీ సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో ఎలాంటి నష్టం జరగకుండా సిద్ధంగా ఉండాలని తెలిపారు. చేపలు పట్టడానికి చెరువులు, వాగుల దగ్గరికి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, వర్షాల వలన ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉండాలని, ఎలాంటి నష్టం వాటిల్లకుండా జరగకుండా  అధికారులు సమన్వయంతో టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని తెలిపారు.  ప్రమాద ప్రాంతాలకు ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కఠినంగా నిరోధించాలని తెలిపారు. అవసరమైనచోట ట్రాఫిక్ మళ్లించాలని సూచించారు.
వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ వనమల చంద్ర శేఖర్ మరియు ఎ ఎస్ పి నర్మదా తదితరులు పాల్గొన్నా రు

Share This Post