* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి ఆగస్టు 26 (గురువారం).
గిరిజన ప్రాంతాల్లో మలేరియా, డెంగ్యూ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గిరిజన అభివృద్ధి మరియు మహిళా,శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి సీజనల్ వ్యాధులను అరికట్టడం మరియు విద్యా సంస్థల పునఃప్రారంభం పై చర్చించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభమై వర్షాలు కురుస్తున్నందున రెండు జిల్లాలలోని మారుమూల ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో సీజనల్ వ్యాధులు అయిన మలేరియా, డెంగ్యూ తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున రెండు జిల్లాలోని అన్ని గ్రామాల్లో గ్రామపంచాయతీ సహకారంతో 100% శానిటేషన్ కార్యక్రమాలు నిర్వహించి గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని అదేవిధంగా ఇంటింటికి ఫీవర్ సర్వే పూర్తి చేసి మలేరియా, డెంగ్యూ తదితర లక్షణాలు ఉన్న వారిని గుర్తించి ప్రత్యేకంగా వైద్య సేవలు అందించాలని, అవసరమైతే సమీప ప్రాంతాల ఏరియా ఆస్పత్రికి తరలించాలని అన్నారు. గ్రామాలలో విలేజ్ హెల్త్ సానిటేషన్ కమిటీలు చురుగ్గా వ్యవహరించాలని అన్నారు.
సెప్టెంబర్ 1వ తేదీ నుండి విద్యాసంస్థలు పునః ప్రారంభమవుతున్నoదున విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తుగా విద్యాసంస్థలను శానిటేషన్ చేసి ముస్తాబు చేసి సిద్ధం చేయాలని అన్నారు.స్థానిక ప్రజా ప్రతినిధులు, గ్రామ పంచాయతీల సహకారంతో గ్రామాలలో మరియు మున్సిపాలిటీ అధికారులతో మున్సిపాలిటీ ప్రాంతాల్లోని విద్యా సంస్థలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, ప్రతి తరగతి గదిని శానిటైజ్ చేయాలని, చాలా రోజుల నుండి విద్యాసంస్థలు తెరవకపోవడం మూలంగా వాటర్ ట్యాంకులు, కిచెన్ షెడ్లు నిరుపయోగంగా ఉండి మురికిగా తయారయ్యాయని వాటిని ప్రత్యేక శ్రద్ధతో శుభ్రపరచాలని హాస్టల్లో మరియు స్కూల్ లలో మధ్యాహ్న భోజనం కోసం నిల్వ ఉన్న ఆహార పదార్థాలను వాడరాదని,ఈ నెల 31లోగా నెల రోజులకు సరిపడే సరుకులను సమకూర్చుకోవాలని అన్నారు. మరుగుదొడ్లను శుభ్రపరచాలని, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సంప్రదించి పాఠశాలకు వచ్చే విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించే ఏర్పాటు చేయాలని, జిల్లా, మండల,గ్రామ స్థాయి అధికారులు, మండల, గ్రామ స్థాయి ప్రజా ప్రతినిధులు పాఠశాలల పునః ప్రారంభం పై ప్రత్యేక దృష్టి సారించి ప్రభుత్వ విద్య సంస్థలలో తల్లిదండ్రుల ఆమోదంతో విద్యార్థులు అధికంగా హాజరయ్యేలా చూడాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక వెయ్యి రూపాయలు, ఆశ్రమ పాఠశాలలకు 20 వేల రూపాయల చొప్పున కేటాయించడం జరిగిందని వీటితో ఆయా సంస్థలలో అవసరమైన ధర్మ మీటర్, పల్స్ ఆక్షి మీటర్లను సమకూర్చుకోవాలని, ఆశ్రమ పాఠశాలలో అవసరమైన చిన్న చిన్న మరమ్మతులు చేసుకోవాలని అన్నారు. గోదావరి నది తీరంలో కరకట్టల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 137 కోట్ల రూపాయలను విడుదల చేసిందని ఆ నిధులతో కరకట్టల ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత అంగన్వాడీలు, పాఠశాలలు, వసతి గృహాలు ఓపెన్ స్తున్నందున ఫుడ్ పాయిజనింగ్ జరగకుండా ముందస్తుగా ఆయా సంస్థలలో నిలువ ఉన్న ఆహార పదార్థాలను తీసివేసి మళ్లీ కొత్తగా సమకూర్చుకోవాలని, విద్యార్థులకు ముందస్తుగా ధర్మ క్లీనింగ్ చేసి పాఠశాలలకు అనుమతించాలని, అన్ని యాజమాన్యాల పాఠశాలలను ముందస్తుగా పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో పిల్లలను పాఠశాలలకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడతారని ప్రభుత్వం అన్ని జాగ్రత్తలతో విద్యా సంస్థలను ప్రారంభిస్తున్నoదున తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురి కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని పాఠశాలకు పంపించాలని, పిల్లలలో ఏవైనా కరోనా లక్షణాలు కనబడితే మాత్రం ముందస్తు వైద్య పరీక్షలు నిర్వహించి పాఠశాలకు పంపించాలని కోరారు.
భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు రాకుండా ప్రభుత్వం వన్ ముందస్తుగా అన్ని చర్యలు చేపడుతుందని, పట్టణ ప్రాంతంలో డెంగు వ్యాధి సోకే అవకాశం ఉన్నందున మున్సిపాలిటీ పరిధిలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలని గ్రామీణ ప్రాంతాల్లో మలేరియా వ్యాధి సోకకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని విద్యా సంస్థలలో శానిటేషన్ కార్యక్రమాల నిర్వహణ కార్యక్రమాలలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు పాల్గొని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అన్నారు.
అనంతరం దివ్యాంగులకు వీల్ చైర్ లను అందించారు. బదిలీపై అదిలాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ వెళ్తున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ జిల్లాకు అందించిన సేవలను కొనియాడి ఇదే విధమైన సేవలను మారుమూల అదిలాబాద్ జిల్లా ప్రజలకు కూడా అందించాలని ఆశిస్తూ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్ మరియు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య లు వేరువేరుగా బదిలీపై వెళ్తున్న అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ జగదీష్, ములుగు అదనపు కలెక్టర్ ఆదర్శ్ సురభి, డిఆర్ఓ రమాదేవి, రెండు జిల్లాల జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.