నల్గొండ, మే 2 :: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు, పాటశాలల్లో మౌలిక వసతుల కల్పనకు చేపట్టిన మన వూరు – మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, టి. హరీష్ రావు లు పిలుపునిచ్చారు. మన వూరు, మన బడి కార్యక్రమం పై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు లు నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీఆర్ కేఆర్ భవన్ నుండి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యా శాఖ కార్యదర్శి సందీవ్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్ దేవ సేన, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకాటి కరుణ, హెల్త్ డైరెక్టర్ జి. శ్రీనివాస్, ఆరోగ్య శాఖ ఓ.ఎస్.డి గంగాధర్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ, మన వూరు- మన బడి కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దెందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొదటి దశలో 9,123 పాఠశాలల్లో రూ.3497 .62 కోట్లతో 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. రూ. 30 లక్షలలోపు పనులను పాఠశాల నిర్వహణా కమిటీలకు అప్పగించామని వెల్లడించారు. రూ.30 కోట్ల పైబడి పనులను టెండర్ల ద్వారా చేపడుతున్నట్టు చెప్పారు.
ఈ సందర్బంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి. హరీష్ రావు మాట్లాడుతూ, మనవూరు, మన ఊరి బడి కార్యక్రమానికి నిధుల కొరత లేదని, ఇప్పటికే అన్ని జిల్లాలకు అడ్వాన్స్ గా నిధులు విడుదల చేశామని అన్నారు. విద్యా యజ్ఞంగా చేపట్టిన ఈ మన వూరు, మన బడి కార్యక్రమంలో మంజూరు చేసిన పనులన్నింటినీ సీనియర్ అధికారులతో తనికీ చేయించాలని కోరారు. పనుల ప్రారంభానికి ముందు పాఠశాల ఏవిధంగా వుంది, పనుల తర్వాత ఏ విధంగా ఉందనేదానిపై ఫోటోలు తీయించాలని తెలిపారు. ప్రతీ మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి పనులను నాణ్యతతో, త్వరిత గతిన పూర్తయ్యేలా చూడాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రూ. 30 లక్షల లోపు పనులన్నింటికీ ఈ నెల 10వతేదీ లోపు పరిపాలన సంబంధిత మంజూరి చేసి 15 నాటికి ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రూ. 30 లక్షలకు పైబడ్డ పనులకు ఈనెలాఖరు వరకు టెండర్ల పక్రియను పూర్తి చేసి పనులను చేపట్టాలని ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,డి. ఈ. ఓ.బిక్షపతి,పంచాయతీ రాజ్ ఈ ఈ తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు