ASF : వైద్య కళాశాల తరగతులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలి : రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి రిజ్వి

2023-24 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన వైద్య కళాశాలలలో తరగతులు ప్రారంభించే విధంగా చర్యలు చేపట్టి పనులు పూర్తిచేయాలని రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి రిజ్వి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్ళు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి ఇంజనీర్లతో వైద్య కళాశాలల నిర్మాణం, వసతుల కల్పన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య కార్యదర్శి రిజ్వి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను వేగవంతంగా అందించేందుకు వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంచే విధంగా రాష్ట్రవ్యాప్తంగా వైద్య కళాశాలలు ప్రారంభించడం జరుగుతుందని, ఈ క్రమంలో చేపట్టిన కళాశాలల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేసే విధంగా అధికారులు కృషి చేయాలని తెలిపారు.

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలో గల వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రామకృష్ణ, వైద్య కళాశాల ప్రిన్సిపల్ నాగార్జున చారి, టి ఎస్ ఎం ఎస్ ఐ డి సి ఇంజనీర్లతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు 70 శాతం పూర్తయ్యాయని, రెండు విడతల వారీగా పనులు వేగవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వైద్య కళాశాల భవనంలో తలుపులు, కిటికీల ఏర్పాటు, రంగులు వేయుట పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కళాశాలలో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థిని విద్యార్థుల కోసం వసతి కల్పించేందుకు సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జూన్ 15వ తేదీ లోగా పనులు పూర్తి చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి – కొమురంభీం ఆసిఫాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post