ఆదిలాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి స్థానానికి విట్టల్ దండే ఎన్నికైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రకటించారు. ఈ నెల 10 న ఎమ్యెల్సీ స్థానానికి పోలింగ్ జరగగా, మంగళవారం రోజున ఓట్ల లెక్కింపు స్థానిక టీటీడీసీలో నిర్వహించారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు, ఆ తర్వాత వివిధ పోలింగ్ కేంద్రాలలో బ్యాలెట్ బాక్స్ లలో పోలైన ఓట్లను లెక్కింపు నిర్వహించారు. మొత్తం 862 ఓట్లు పోల్ కాగా, 817 ఓట్లు చెల్లుబాటు అయ్యాయని, 45 చెల్లని ఓట్లు గా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఇందులో 742 ఓట్లు విట్టల్ దండే కు రాగా, 75 ఓట్లు పెందూర్ పుష్ప రాణి కి ఓట్లు పోల్ అయ్యాయని తెలిపారు. ఆదిలాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి స్థానానికి విట్టల్ దండే ఎంపిక అయినట్లు ఎన్నికల పరిశీలకులు నవీన్ మిట్టల్ సమక్షంలో అభ్యర్థికి ధ్రువీకరణ పత్రం ఎన్నికల అధికారి, కలెక్టర్ అందజేశారు. ఎన్నికల లెక్కింపు సమర్థవంతంగా నిర్వహించిన సిబ్బందికి, సహకరించిన వారందరికీ కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఆర్డీఓ రాజేశ్వర్, కలెక్టరేట్ సిబ్బంది, పోలీస్ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.