రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, ఆలాగే రాబోయే రెండు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున జిల్లా యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేస్ కుమార్ ఆదేశించారు.
సోమవారం ఆయన హైదరాబాద్ నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో భారీ వర్షాల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల విషయమై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
భారీ వర్షాలు కురుస్తున్నందున రాష్ట్రంలో ని పలు ప్రాంతాలలో వాగులు వంకలు,చెరువులు నిండి ప్రవహిస్తున్నాయని అలాగే రానున్న రెండు రోజులు కూడా భారీ వర్షాలకు ఆస్కారం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 31న కృష్ణాష్టమి సెలవు దినం అప్పటికీ జిల్లా నుండి మొదలుకొని గ్రామస్థాయి వరకు అధికారులు, సిబ్బంది అందరూ వారి వారి కార్యస్థానాలలో అందుబాటులో ఉండాలని చెప్పారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా వాగులు, వంకలు పొంగిపోవడం, రహదారులపై నీరు ఉధృతంగా ప్రవహించే చోట ప్రమాదం జరగకుండా, మనుషులు, పశువుల ప్రాణాలు పోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఈ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు.రెవెన్యూ, పోలీస్, నీటి పారుదల, జిల్లా యంత్రాంగాలు సమన్వయంతో పని చేసి ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. అదేవిధంగా చెరువులు, రహదారులు తెగిపోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. కాజ్ వేలను మించి ప్రవాహాలు ఉన్నచోట ఎవరు సాహసం చేయకుండా ప్రమాదం సూచికలు ఏర్పాటు చేయాలని, ప్రజలు వరద లోకి వెళ్లవద్దని ముందే హెచ్చరించాలని అక్కడ మనుషులను ఏర్పాటు చేయాలని చెప్పారు. అదేవిధంగా తెగిపోఎందుకు ఆస్కారం ఉన్న చెరువులు, రహదారులను గుర్తించి ముందే జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. వర్షాల వల్ల పడిపోయేందుకు సిద్ధంగా ఉన్న పాత ఇండ్లను గుర్తించి అలాంటి ఇండ్లనుండి ప్రజలను తరలించి సురక్షిత ప్రాంతాలలో ఉంచాలన్నారు.
రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా పోలీసు అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఇరిగేషన్, ఇతర శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని , ఆస్తి,ప్రాణ నష్టం జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని, ప్రత్యేకించి లోతట్టు ప్రాంతాలలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ఈ విషయంలో ఎస్ పి మొదలుకొని ఎస్ ఐ వరకు అప్రమత్తంగా ఉండి ఏక్కడ ప్రమాదం జరగకుండా చూడాలని కోరారు.
జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, జిల్లా ఎస్పీ. ఆర్, వెంకటేశ్వర్లు, ఆదనపు కలెక్టర్లు తేజస్ నందలాల్ పవర్, రెవిన్యూఅదనపు కలెక్టర్ కె.సీతారామరావు, డి ఆర్ ఓ కే. స్వర్ణలత, ఆర్ డి ఓ పద్మ శ్రీ, సి పి ఓ దశరథం, ఇరిగేషన్ అధికారులు చక్రధర్,పి ఆర్ ఈ నరేందర్ తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు .