ఓటు హక్కు సక్రమంగా వినియోగించడం ద్వారా సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకొని దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించవచ్చని, అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును నిర్భయంగా, పారదర్శకంగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి సంయుక్త ప్రధాన ఎన్నికల అధికారి టి. రవికిరణ్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, సంబంధిత అధికారులతో జాతీయ ఓటరు దినోత్సవం, పి.ఎస్.ఈ. ఎంట్రీ ధృవీకరణ, ఓటర్ ఎపిక్ కార్డుల జారీ, ఓటర్ ఐ.డి.తో ఆధార్ అనుసంధానం ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ జిల్లాలలో రాబోయే 15 రోజుల్లో ఓటరు జాబితాలో ఉన్న పి.ఎస్.ఈ. ఎంట్రీలు 100 శాతం క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయ్యేలా జిల్లా ఎన్నికల అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నెల 25న రాష్ట్ర వ్యాప్తంగా 13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని, ప్రతి జిల్లాలో ఎన్నికల కమీషన్చే జారీ చేయబడిన పాటను మైక్ల ద్వారా వినిపించిన అనంతరం అందరితో ప్రతిజ్ఞ చేయించాలని, 80 సంవత్సారాలు వయస్సు పైబడిన ఓటర్లను, నూతన ఓటర్లను సన్మానించాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ అందించే ఓటరు పాటను స్థానిక కేబుల్ ఛానళ్లలో, సినిమా థియేటర్లలో ప్రదర్శించాలని, ఈ సంవత్సరం ఓటరు దినోత్సవం యొక్క థీమ్ అయిన “నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్” ప్రకారం ప్రతి ఒక్కరు ఎన్నికల సమయంలో ఓటు హక్కు తప్పనిసరిగా వినియోగించుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు, ప్రతి గ్రామంలో, మున్సిపాలిటీలో ఓటరు దినోత్సవం వేడుకలను నిర్వహించి ప్రతిజ్ఞ చేయించాలని, రాష్ట్ర వ్యాప్తంగా 35 వేల పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న 12 లక్షల పి.ఎస్.ఈ. ఎంట్రీలను బూత్ స్థాయి అధికారులు రాబోయే 15 రోజుల్లో 100 శాతం క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని, ఆ దిశగా జిల్లా ఎన్నికల అధికారులు పర్యవేక్షించాలని తెలిపారు. జిల్లాలలో నూతనంగా ఓటు నమోదు చేసిన అభ్యర్థులకు ఓటరు కార్డులు పోస్టల్ శాఖ ద్వారా ఓటర్లకు చేరే విధంగా జిల్లా స్థాయిలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటు హక్కుపై విద్యాసంస్థలు, ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు, విద్యార్థినీ, విద్యార్థులు, ప్రజలు జిల్లా, నియోజకవర్గ, పోలింగ్ కేంద్రాల వారిగా నిర్వహించే ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. దేశ భవిష్యత్తు యువతరానిదేనని, 18 సం||లు నిండిన ప్రతి ఒక్కరు వారి ఓటు నమోదు చేసుకొని ఎన్నికలలో నిర్భయంగా, పారదర్శకంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు ద్వారా యువత తమ ఆలోచనాత్మక నిర్ణయాన్ని తెలియజేయవచ్చని తెలిపారు. ప్రజలు, యువత ఓటు విలువను తెలుసుకోవాలని తెలిపారు. నూతన ఓటు నమోదు కొరకు ప్రభుత్వం జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1 తేదీలను ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందని, 18 సం॥లు వయస్సు నిండిన ప్రతి ఒక్కరు ఫారం-6 ద్వారా నూతన ఓటు నమోదు చేసుకోవచ్చని, 17 సం||లు ఉన్న వారైతే తమ వివరాలను ముందుగానే ఎన్రోల్ చేసుకోవచ్చని తెలిపారు. ఫారం-62 ద్వారా ఓటరు కార్డు కలిగిన వారు ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవాలని తెలిపారు. నూతన ఓటు నమోదు, ఆధార్ అనుసంధానం కొరకు జిల్లా ఎన్నికల అధికారి, ఎన్నికల రిటర్నింగ్, సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, బూత్ స్థాయి అధికారుల వద్ద సంప్రదించాలని, ఆన్లైన్లో www.eci.gov.in, www.ceotelangana.nic.in వెబ్సైట్లలో, ఓటర్ హెల్ప్న్ యాప్ ద్వారా చేసుకోవచ్చని, వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 లో సంప్రదించవచ్చని తెలిపారు.
జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి మాట్లాడుతూ నూతన ఓటరు నమోదు, ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రక్రియపై జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామని, ఈ నెల 25న నిర్వహించనున్న జాతీయ ఓటరు దినోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా పూర్తి స్థాయి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారి శ్యామలాదేవి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.