జిల్లాలో పరిశ్రమల స్థాపన దిశగా అనుమతుల కొరకు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి టి.ఎస్.- ఐ పాస్ ద్వారా అర్హత గల పరిశ్రమలకు నిర్ధేశిత సమయంలోగా సంబంధిత అనుమతులను అందజేయాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్లో గల కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల కొరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి టి.ఎస్.- ఐ పాస్ ద్వారా వివిధ శాఖల ద్వారా జారీ చేయవలసిన అనుమతులను నిర్ధేశిత సమయంలోగా అందజేయాలని, అనుమతులు పొందిన పరిశ్రమలు స్థానికులకు ఉపాధి కల్పించేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. టి-ప్రైడ్ పథకం ద్వారా దళితులు, గిరిజనులకు సంబంధించి 5 పెట్టుబడి, రాయితీ దరఖాస్తులను ఆమోదిస్తూ 23.91 లక్షల రూపాయలు, 3 పావలా వడ్డీ రాయితీ దరఖాస్తులను ఆమోదిస్తూ 34 వేలు మంజూరు చేయడం జరిగిందని, 3 మట్టి పైపుల తయారీ కంపెనీలకు నెలకు 1 వేయి 510 టన్నుల చొప్పున సింగరేణి నుండి బొగ్గు తీసుకొనుటకు అనుమతి మంజూరు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ జి.ఎం. ఎం.హరనాథ్, జిల్లా పట్టణ ప్రణాళిక అధికారి ఆర్. సత్యనారాయణ, టి.ఎస్. ఎన్.పి. డి.సి. ఎల్. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ బాలకృష్ణ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచిర్యాల శాఖ చీఫ్ మేనేజర్ గౌతమ్ గోసాయి, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ సహాయ అధికారి ఎం.రవి, ఇండస్ట్రియల్ ప్రమోషన్ అధికారి ఎం.అశోక్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది.