వరిధాన్యం నిర్ధేశిత లక్ష్యాలను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోకళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్తో కలిసి జిల్లా అధికారులు, రైస్మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వరిధాన్యం నిర్ధేశిత లక్ష్యాలను జిల్లా అధికారులు, రైస్మిల్లర్లు సమన్వయంతో వేగవంతంగా పూర్తి చేయాలని తెలిపారు. కమీషన్ పేరుతో తరుగు ఎక్కువగా నమోదు చేయడం, అప్లోడ్ చేయడం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం రైతుల కొరకు ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌళిక సదుపాయాలతో పాటు వరిధాన్యం మాయిశ్చర్, క్లీనింగ్, తరుగు ప్రక్రియ సక్రమంగా నిర్వహించాలని, విధుల పట్ల నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి రైస్మిల్లులకు ధాన్యం తరలించే లారీల నుండి లోడింగు వేగవంతంగా నిర్వహించాలని, పౌరసరఫరాల శాఖ అధికారులు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. ఏజెన్సీలు ప్రతి రోజు కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా లాదీలను నడిపించాలని అన్నారు. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే వరిధాన్యం నిబంధనలకు అనుగుణంగా నాణ్యమైన ధాన్యాన్ని తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. మిల్లర్లు వారికి కేటాయించిన లక్ష్యాలను జనవరి 15వ తేదీ లోగా పూర్తి చేసే విధంగా కార్యచరణ రూపొందించుకొని అమలు చేయాలని తెలిపారు. ఒక వరిధాన్యం సంచికి గాను 40 కిలోల 600 గ్రాముల బరువు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, రైస్మిల్లర్లు ఈ ప్రకారంగా ప్రక్రియ కొనసాగించాలని ఆదేశించారు. జిల్లాలో 2022-23 సంవత్సరం వానాకాలానికి గాను జిల్లాలో 2 లక్షల 90 వేల ఎకరాలలో వరిధాన్యం సాగు జరిగిందని, పంట కొనుగోలు చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, సహకార శాఖల పరిధిలో 229 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి గ్రేడ్-ఎ రకానికి 2 వేల 60 రూపాయలు, సాధారణ రకానికి 2 వేల 40 రూపాయల మద్దతు ధరతో ఇప్పటి వరకు 581 మంది రైతుల నుండి 4 వేల 386 మెట్రికటన్నుల ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు. ధాన్యం రవాణాకు గాను మొత్తం 72 లక్షల 50 వేల గన్నీ సంచులు అవసరం కాగా 32 లక్షల 82 వేల గన్నీ సంచులు అందుబాటులో ఉన్నాయని, మిగతా వాటిని సమకూర్చే విధంగా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, 1 వేయి 778 టార్పాలిన్లు, 294 వేయింగ్ స్కేళ్లు, 229 మాయిశ్చర్ మీటర్లు, 94 క్లీనర్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో 1 లక్షా 53 వేల 750 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో 51 రైస్మిల్లులు ఉన్నాయని, కొనుగోలు చేసిన 4 వేల 336 మెట్రిక్ టన్నుల ధాన్యంలో 2 వేల 946 మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్మిల్లులకు తరలించడం జరిగిందని, మిగిలిన 1 వేయి 389 మెట్రిక్ టన్నుల ధాన్యం లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఇప్పటి వరకు 42 మంది రైతులకు సంబంధించి 296 మెట్రిక్ టన్నుల ధాన్యం వివరాలను ట్యాబ్లలో నమోదు చేసి 61 లక్షల రూపాయలు సంబంధిత రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని, మిగిలిన వారి వివరాలు త్వరగా నమోదు చేసి చెల్లింపులు చేయాలని తెలిపారు. రైతుల సౌకర్యార్థం జిల్లా స్థాయిలో జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ నం. 63039-28682ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఉదయం 8 గం॥॥ల నుండి రాత్రి 8 గం॥ల వరకు సిబ్బంది కంట్రోల్ రూమ్లో అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా (గ్రామీణాభివృద్ధి అధికారి శేషాద్రి, జిల్లా వ్యవసాయ అధికారి కల్పన, జిల్లా పౌరసరఫరాల అధికారి ప్రేమ్కుమార్, మార్కెటింగ్ అధికారి గజానంద్, రైస్మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షులు నల్మాసు కాంతయ్య, డి.సి. ఎస్.సి. చైర్మన్ తిప్పర్తి లింగయ్య, రైస్మిల్లర్లు, లారీ అసోసియేషన్ ప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది.